కలం, మెదక్ బ్యూరో: ప్రకృతి పరిరక్షణ, పక్షుల సంరక్షణపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో మెదక్ జిల్లాలోని పోచారం అభయారణ్యం (Pocharam Wildlife Sanctuary)లో డీఎఫ్ఓ జోజి ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బందితో బర్డ్ వాక్ ( Bird Walk) కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్, డీఎఫ్ఓ జోజి పోచారంలోని డీబీసీలో నాలుగు కిలోమీటర్ల బర్డ్ వాక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని.. ఇందులో భాగంగా బర్డ్ వాక్ నిర్వహించడం జరిగిందన్నారు. పోచారం ల్యాండ్స్కేప్ యొక్క గొప్ప పక్షి వైవిధ్యం, సహజ వారసత్వం పట్ల ప్రశంసను ప్రోత్సహించడానికి బర్డ్ వాక్ నిర్వహించామని చెప్పారు.
పోచారం జలాశయం, అభయారణ్యం చుట్టూ ఉన్న పోచారం ప్రాంతం, వలస నీటి పక్షులు, కొంగలు, ఐబిస్లు, బాతులు అనేక అటవీ ప్రాంతాలతో సహా విభిన్న పక్షి జీవనానికి ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ ప్రాంతం జీవ వైవిధ్యానికి గమ్యస్థానంగా నిలుస్తుందని ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు వివిధ రకాల పక్షులను వీక్షించాలని కోరారు. పక్షుల జీవన విధానం, వలస పక్షుల ప్రాముఖ్యత, పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్ర గురించి తెలుసుకొవాలన్నారు. పక్షుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చెట్లు నాటడం, నీటి వనరులను కాపాడడం, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం అవసరమని డిఎఫ్ఓ అభిప్రాయపడ్డారు.

