కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Houses) పథకంలో కోత విధించబోతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఖమ్మం కాంగ్రెస్ భవన్లో జరిగిన ప్రెస్ మీట్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) మాట్లాడుతూ ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇళ్లను నియోజక వర్గానికి 1000 చొప్పున మంజూరు చేస్తామని చెప్పారు. అయితే, గత ఏడాది నియోజక వర్గానికి 3,500 చొప్పున ఇళ్లను కేటాయించిన ప్రభుత్వం.. ఇందుకోసం రూ.12,571 కోట్లు కేటాయించింది. ఈసారి బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5,500 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. అంటే బడ్జెట్ సగానికి పైగా తగ్గించినట్లుగానే, ఇందిరమ్మ ఇళ్ల సంఖ్య కూడా సగానికి పైగా తగ్గించబోతున్నట్లు భట్టి వ్యాఖ్యలతో స్పష్టం అవుతోంది.

