కలం, వెబ్ డెస్క్: మెట్రో ఫేజ్2కు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి (Bhatti Vikramarka) విక్రమార్క కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలకు సైతం నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని భట్టి కోరారు. శనివారం న్యూఢిల్లీలోని అశోకా హోటల్లో నిర్వహించిన ప్రీ-బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న ఆయన, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ ముందస్తు సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, కేంద్ర–రాష్ట్రాల సమన్వయంతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో రాష్ట్రాలను భాగస్వాములుగా చేయడం సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని ఆయన అభినందించారు.
జీడీపీలో తెలంగాణ వాటా 5.1 శాతం
ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.1 శాతంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ను ఆవిష్కరించామని, దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతం ఉన్న 200 బిలియన్ డాలర్ల నుంచి 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచడమే తమ ధ్యేయమని వెల్లడించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తెలంగాణలో పెట్టుబడి రేటును జీఎస్డీపీ లో 37 శాతం నుంచి 50 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాల ద్రవ్యలోటు పరిమితిని కనీసం 4 శాతానికి పెంచాలని, రాష్ట్రాలకు ఇస్తున్న 50 ఏళ్ల వడ్డీ లేని రుణాలను గ్రాంట్లుగా మార్చి, ఆ సహాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్రాన్ని కోరారు. విద్య, ఆరోగ్య రంగాల కోసం సమకూర్చే వనరులను ఎఫ్ఆర్బీఎం పరిమితుల నుంచి మినహాయించాలని సూచించారు.
ఆధునిక వసతులతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు
తెలంగాణలో వెయ్యికి పైగా కులాల వారీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని, ఇకపై 119 నియోజకవర్గాల్లో ఆధునిక వసతులతో కూడిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు’ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల విద్యార్థులు కలిసి చదువుకునేలా ఈ పాఠశాలలు రూపుదిద్దుకుంటాయని చెప్పారు. అలాగే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం తన మొత్తం వ్యయంలో 20 శాతం కంటే ఎక్కువను రాష్ట్ర, ఉమ్మడి జాబితా అంశాలపై ఖర్చు చేస్తోందని, ఇందులో 25 శాతం తగ్గించి రూ.2.21 లక్షల కోట్లను నేరుగా రాష్ట్రాలకు బదిలీ చేయాలని భట్టి విక్రమార్క సూచించారు.
సెస్లు, సర్చార్జీల వాటా కేంద్ర పన్ను రాబడిలో 20 శాతానికి చేరడంతో, 15వ ఆర్థిక సంఘం సూచించిన 41 శాతం పన్ను బదిలీ ఉన్నప్పటికీ రాష్ట్రాలకు కేవలం 30 శాతం మాత్రమే అందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.1.55 లక్షల కోట్ల సర్చార్జీలను మౌలిక సదుపాయాల నిధికి మళ్లించాలని లేదా వాటిని ప్రాథమిక పన్ను రేట్లలో కలిపి రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని కోరారు.
కేంద్రానికి పలు డిమాండ్లు
తెలంగాణకు సంబంధించిన కీలక ప్రాజెక్టులపై కూడా ఆయన కొన్ని డిమాండ్లు కేంద్రం ముందు ఉంచారు. ప్రాంతీయ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాలని, హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు సంబంధించి త్వరగా నిర్ణయం తీసుకుని అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విద్యారంగంలో హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటును ప్రకటించడంతో పాటు, మిగిలిన జిల్లాల్లో కేంద్రీయ, జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు. పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం ప్రాంతాల్లో విమానాశ్రయాలకు అనుమతి ఇవ్వాలని, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
అలాగే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు రూ.14,100 కోట్లు, రేడియల్ రోడ్లకు రూ.45,000 కోట్లు, హైదరాబాద్ మురుగునీటి పారుదల ప్రణాళికకు రూ.17,212 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనలను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని ఆశిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు.
Read Also: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో పోటీకి సిద్దమైన జనసేన
Follow Us On: Instagram


