కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో అంతరాలు లేని సమాజం కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. అసెంబ్లీలో 2026-27 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్ ను ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సుదీర్ఘ ప్రసంగం ఇచ్చారు. భట్టి మాట్లాడుతూ.. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సామాజిక న్యాయం చేయాలనేది తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. వసతి పాఠశాలలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. రూ.368 కోట్ల 27 లక్షల అంచనా వ్యయంతో 910 ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు / అంబేద్కర్ భవనాలు / విగ్రహాలు మంజూరు చేశామని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం (SC and ST Sub-Plan Act) అమలును సంపూర్ణంగా అమలు చేయడానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని భట్టి తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన నాటికే 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి సబ్ ప్లాన్ చట్ట ప్రకారం ఖర్చు చేయాల్సిన నిధులలో ఎస్సీలకు చెందిన రూ.13 వేల 617 కోట్లు, ఎస్టీలకు చెందిన రూ.1,317 కోట్లు, మొత్తం రూ.14 వేల 934 కోట్లు ఖర్చు కాకుండా ఉందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో చేసిన కేటాయింపులతో పాటు, ఈ బకాయిలను కూడా అదనంగా కేటాయించడం జరిగిందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ క్యారీ ఫార్వర్డ్ చేయవలసిన నిధులు, ఎస్సీలకు 7,757 కోట్లు, ఎస్టీలకు 1,754 కోట్లు ఖర్చు చేయవలసి ఉందని చెప్పారు. వాటిని తాము 2026-27 ఆర్థిక సంవత్సరంలో కేటాయించాల్సిన మొత్తానికి అదనంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెందిన బకాయిలను కూడా కేటాయిస్తున్నామన్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కొత్తగా డా.బి.ఆర్.అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ (Ambedkar Knowledge Tower)ను నిర్మిస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా నింబోలి అడ్డ కాచిగూడలో బాబూ జగ్జీవన్ రామ్ పేరుతో నూతన వసతి గృహాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

