కలం, వెబ్ డెస్క్ : జీహెచ్ ఎంసీ పునర్ వ్యవస్థీకరణపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక ప్రకటన చేశారు. జీహెచ్ ఎంసీ పునర్ వ్యవస్థీకరణను పరిపాలనా సౌలభ్యం కోసమే చేశామని.. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదుగుతోంది కాబట్టే.. సిటీ ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఉన్న 20 మున్సిపాలిటీలను, 7 కార్పొరేషన్లను జీహెచ్ ఎంసీలో విలీనం చేసి పరిపాలనను మరింత సులభతరం చేశామన్నారు.
జీహెచ్ ఎంసీని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు కార్పొరేషన్లుగా విభజించి.. పాలనాపరమైన సంస్కరణలు తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో కంపెనీలను ఔటర్ రింగ్ రోడ్డుకు, రీజినల్ రింగ్ రోడ్డుకు మధ్యలోకి తరలించి ఫ్యూచర్ సిటీని భవిష్యత్ తరాల కోసం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ మూడు మున్సిపల్ కార్పోరేషన్లతో పాటు, హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సంస్థ, హైడ్రా లాంటి సంస్థలను సమన్వయ పరిచేందుకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసేందుకు చట్ట సవరణ చేయబోతున్నట్టు డిప్యూటీ సీఎం చెప్పారు.

