కలం, వెబ్ డెస్క్: ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండడం వారి ఆత్మ గౌరవానికి చిహ్నమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అభిప్రాయపడ్డారు. దీనిని గుర్తించి ప్రభుత్వం “ఇందిరమ్మ ఇండ్లు” (Indiramma Indlu) అనే పవిత్రమైన ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. దీనికోసం పేద కుటుంబాలకు వారి సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఈ పథకం కింద ప్రభుత్వం 4 లక్షల 50 వేల ఇళ్లను మంజూరు చేసిందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హత కలిగిన అన్ని వర్గాలవారికి ఈ ఇండ్లు కేటాయించబడతాయని చెప్పారు. గిరిజన జనాభా ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తూ, ప్రతి నియోజక వర్గానికి అదనంగా వెయ్యి ఇండ్లు కేటాయించామని చెప్పారు. ఈ పథకానికి 22 వేల 500 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఇప్పటి వరకు రూ. 5 వేల 73 కోట్ల 84 లక్షలు ఖర్చు చేశామని చెప్పారు. ఈ బడ్జెట్లో గృహ నిర్మాణ శాఖకు 7,430 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నామని భట్టి వెల్లడించారు.

