కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీ కాలనీ అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడిన కేసులో ఇద్దరు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు పట్టణాల మధ్య విస్తరించి ఉన్న దట్టమైన అటవీ ప్రాంతానికి ఆనుకొనే హమాలీ కాలనీ ఉంటుంది. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో అడవిలోని వన్యప్రాణులు నీటి కోసం సమీపంలోని గ్రామాలు, కాలనీల వైపునకు వస్తుంటాయి.
దీనిని ఆసరాగా చేసుకున్న స్థానికులు కొందరు వన్యప్రాణుల కోసం ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హమాలీ కాలనీకి చెందిన సాంబయ్య, సమ్మయ్య అనే వ్యక్తులు అడవిలో ఉచ్చులు వేసి, అందులో చిక్కుకున్న రెండు దుప్పులను చంపారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అటవీ అధికారులు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. వన్యప్రాణులను వేటాడినా, చంపినా లేదా హింసించినా చట్టపరంగా కఠిన శిక్షలు ఉంటాయని ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు స్థానిక ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

