కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem Police) ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు పోలీసులు నిర్వహించిన ముమ్మర వాహన తనిఖీలలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం ఎక్స్ రోడ్డు వద్ద అన్నపురెడ్డిపల్లి పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్ – ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల నుండి కేరళకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
వారి వద్ద నుండి సుమారు రూ.44,29,500 విలువైన 88.590 కేజీల గంజాయిని, రవాణాకు ఉపయోగించిన ఒక కారును, ఒక మొబైల్ ఫోనును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను కేరళ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ రిషద్, శ్రీ రాజ్ కుంజు వీటిల్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. జిల్లాలో అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని, గంజాయి విక్రయాలు, రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

