కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ఇల్లందు మండలం ధనియాలపాడు పంచాయతీ పరిధిలోని బాలాజీ తండాలో ఉద్రిక్తత నెలకొంది. తనను ప్రేమించి మోసం చేసిన యువకుడి ఇంటి ముందు భూక్యా వెన్నెల అనే యువతి గత నాలుగు రోజులుగా నిరసన దీక్ష చేపట్టింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ రేగుల తండాకు చెందిన వెన్నెల, నాలుగేళ్ల క్రితం తన అమ్మమ్మ ఊరైన బాలాజీ తండాకు వచ్చిన సమయంలో నూనావత్ మహేందర్తో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది.
వీరిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటుండగా, ఇటీవల మహేందర్ అదనపు కట్నం ఆశతో మరో యువతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని వెన్నెలను దూరం పెట్టాడు. ఈ పరిణామంతో మనస్తాపానికి గురైన వెన్నెల ఆత్మహత్యకు ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న వెన్నెల తల్లి, మహేందర్ కుటుంబ సభ్యులను నిలదీసేందుకు వెళ్లగా వారు ఆమెపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
తనను ప్రేమ పేరుతో వంచించడమే కాకుండా, తన తల్లిపై కూడా దాడి చేయడాన్ని నిరసిస్తూ వెన్నెల బాధితుడి ఇంటి ఆవరణలోనే పెళ్లి కోసం పట్టుబడుతూ దీక్షకు దిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని యువతి స్పష్టం చేసింది.

