కలం, వెబ్ డెస్క్ : భారత మహిళా చెస్ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సైప్రస్లో జరిగిన 2026 మహిళా కాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ వైశాలి రమేష్బాబు (Vaishali Ramesh Babu) అద్భుత విజయాన్ని అందుకున్నారు. బుధవారం జరిగిన చివరి రౌండ్లో రష్యా క్రీడాకారిణి కటెరినా లాగ్నోను ఓడించడం ద్వారా ఆమె ఈ ప్రతిష్టాత్మక టైటిల్ను కైవసం చేసుకున్నారు. తద్వారా ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం ప్రస్తుత ఛాంపియన్, చైనాకు చెందిన జు వెన్జున్ను ఢీకొనే సువర్ణావకాశాన్ని వైశాలి (Vaishali Ramesh Babu) సొంతం చేసుకున్నారు.
ఈ టోర్నీ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. టోర్నీ ఆరంభంలో వరుస డ్రాలతో కాస్త నెమ్మదిగా మొదలుపెట్టిన వైశాలి, ఆ తర్వాత ఒక్కసారిగా పుంజుకున్నారు. 14 రౌండ్ల పాటు సాగిన ఈ మెగా ఈవెంట్లో ఆమె మొత్తం 8.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. ముఖ్యంగా చివరి రౌండ్లో వైశాలి గెలవడంతో పాటు, సహచర భారత క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్.. ప్రత్యర్థి బిబిసారాను డ్రాగా అడ్డుకోవడం వైశాలికి టైటిల్ దక్కేలా చేసింది.
ఈ విజయంతో కాండిడేట్స్ టోర్నీ నెగ్గి ప్రపంచ ఛాంపియన్షిప్ ఛాలెంజర్గా నిలిచిన తొలి భారతీయ మహిళగా వైశాలి చరిత్ర సృష్టించారు. గతంలో 2024లో ఆమె సోదరుడు ప్రజ్ఞానంద కూడా కాండిడేట్స్లో రాణించగా, ఇప్పుడు వైశాలి టైటిల్ గెలవడం విశేషం. దశాబ్ద కాలంగా చైనా క్రీడాకారిణుల గుత్తాధిపత్యంలో ఉన్న ఈ టైటిల్ రేసులోకి ఇప్పుడు ఒక భారతీయురాలు ప్రవేశించడం ప్రపంచ చెస్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

