కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని పాల్వంచ, చర్ల, దుమ్ముగూడెంలలో తాగునీటి సమస్యలు ఉన్నప్పటికీ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగమైన 99 రోజుల కార్యాచరణలో వాటిని ఎందుకు పరిష్కరించలేదని జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవోలు మండల స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారా? నిర్వహిస్తే ఇంకా పనులు పెండింగ్లో ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. నిర్లక్ష్యం సహించబోనని స్పష్టం చేస్తూ, నాలుగు రోజుల్లోపే జిల్లా వ్యాప్తంగా ఉన్న తాగునీటి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రానున్న మూడు నెలలు అత్యంత కీలకమని , ఎక్కడా నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
శనివారం ఐడీఓసీ కార్యాలయం నుండి నిర్వహించిన జూమ్ సమావేశం ద్వారా భద్రాచలం పి.ఓ రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులతో కలెక్టర్ వేసవిలో త్రాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల స్థాయిలో తాగునీటి సరఫరా పర్యవేక్షణ బాధ్యత ఎంపీడీవోలదేనని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ అధికారులు, ఎంపీడీవోలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రతి గ్రామానికి నిరంతర నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి త్రాగునీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న తాగునీటి సమస్యలపై సమగ్ర నివేదికలు సమర్పించి, తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వేసవికాలంలో తాగునీటి కొరత సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టి, జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో హెల్ప్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
Read Also: మహిళా సంఘ సభ్యుల ఎడ్యుకేషన్ ప్రొఫైల్ సిద్ధం చేయాలి: సీతక్క
Follow Us On: Sharechat

