కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం జూలూరుపాడు మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ఆకస్మికంగా పరిశీలించారు. గత రాత్రి కురిసిన అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రంలో ఉన్న మొక్కజొన్న నిల్వలు ఏమైనా తడిసాయా? రైతులకు నష్టం వాటిల్లిందా? అనే అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో ముందస్తుగా టార్పాలిన్లతో పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టడం వల్ల ఎటువంటి నష్టం జరగలేదని, ధాన్యం సురక్షితంగా ఉందని అధికారులు కలెక్టర్కు వివరించారు.
కేంద్రంలో నిల్వ ఉంచిన మొక్కజొన్న నాణ్యతను, తేమ శాతాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రంలో 3,600 మొక్కజొన్న బస్తాలు నిల్వ ఉన్నాయని, వాటన్నింటినీ సాయంత్రంలోగా లోడింగ్ ప్రక్రియ పూర్తి చేసి తరలిస్తామని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన మొక్కజొన్నను నిల్వ ఉంచకుండా లోడింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
నిన్న ఎన్ని లారీలు లోడింగ్ అయ్యాయి? ఇప్పటివరకు ఎంత పరిమాణంలో మొక్కజొన్నను గోదాములకు తరలించారనే లెక్కలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు సుమారు 28 వేల మొక్కజొన్న బస్తాలను సురక్షితంగా గోదాములకు తరలించినట్లు అధికారులు నివేదించారు. రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోళ్లు, రవాణా నిరంతరాయంగా సాగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో జూలూరుపాడు తహసీల్దార్ శ్రీనివాస్, కొనుగోలు కేంద్రం బాధ్యులు, మార్కెటింగ్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

