కలం, వెబ్ డెస్క్: భద్రాచలం (Bhadrachalam)లో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఆలయ సిబ్బంది, పోలీసుల (Police) మధ్య వివాదం తలెత్తింది. ఆలయ ఈవోను లోపలికి వెళ్లకుండా పోలీసులు సుమారు 40 నిమిషాల పాటు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆలయ సిబ్బంది, ప్రధాన ద్వారం వద్ద నిరసన చేపట్టారు. వేడుకల సమయంలో తమకు గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు ప్రోటోకాల్ పేరిట నిబంధనలను అతిక్రమిస్తూ తమ బంధువులను దౌర్జన్యంగా దర్శనాలకు పంపిస్తున్నారని ఆలయ సిబ్బంది ఆరోపిస్తున్నారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు, తమ వారికి ప్రాధాన్యత ఇస్తూ ఆలయ అధికారులనే అడ్డుకోవడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాగ్వాదంతో ఆలయం ముందు కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

