కలం, యాదగిరిగుట్ట: సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని ప్రసిద్ధ శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామివారి ఆలయాన్ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు.
సంగమేశ్వర స్వామివారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని బీర్ల అయిలయ్య ఆకాంక్షించారు. ఝరాసంగం కేతకీ సంగమేశ్వర క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

