బెంచ్ ప్లేయర్లపై బీసీసీఐ ఉక్కుపాదం.. కొత్త రూల్స్ ఇవే!

క‌లం, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ (IPL) 2026లో బెంచ్ ప్లేయర్లపై బీసీసీఐ (BCCI) కఠిన నిర్ణయం తీసుకుంది. వారిని పూర్తిగా బెంచ్‌కే పరిమితం చేస్తుంది. వారిలో ఏ ఒక్కరు కూడా మైదానంలో అడుగుపెట్టడానికి వీలులేకుండా నిబంధనలను కఠినతరం చేసింది. టీమ్‌ షీట్‌లో పేర్కొన్న 16 మంది మినహా ఎవరైనా మైదానంలోకి అడుగు పెడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను కోల్‌కతా, లక్నో మ్యాచ్‌తోనే అమల్లోకి తీసుకొస్తోంది. మైదానంలో ఆటగాళ్ల కదలికలపై బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో బెంచ్ ప్లేయర్లు (Bench Players) ఇష్టానుసారంగా గ్రౌండ్‌లోకి రాకుండా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. సాధారణంగా ఐపీఎల్ జట్టులో 25 మంది వరకు ఆటగాళ్లు ఉన్నప్పటికీ, మ్యాచ్ కోసం కేవలం 16 మందిని మాత్రమే టీమ్ షీట్‌లో పేర్కొంటారు. తాజా నిబంధనల ప్రకారం, ఈ 16 మంది జాబితాలో లేని ఏ ఆటగాడు కూడా మైదానంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. చివరికి డ్రింక్స్ అందించాలన్నా, బ్యాట్లు మార్చాలన్నా లేదా టీమ్ మెసేజ్ పంపాలన్నా సరే.. కేవలం ఆ 16 మందిలో ఉన్నవారే రావాల్సి ఉంటుంది. మిగిలిన వారు డగౌట్‌కే పరిమితం కావాలని బీసీసీఐ స్పష్టం చేసింది.

అంతేకాకుండా, బౌండరీ లైన్ వద్ద ఉండే ప్లేయర్లపై కూడా ఆంక్షలు విధించారు. బౌండరీ రోప్ దగ్గర బిబ్స్ ధరించిన వారు గరిష్టంగా ఐదుగురు మాత్రమే ఉండాలి. వీరు బౌండరీ దాటి వెళ్లిన బంతులను తిరిగి ఇవ్వడానికి లేదా డ్రింక్స్ అందించడానికి మాత్రమే పరిమితం కావాలి. అడ్వర్టైజింగ్ బోర్డుల మధ్య తిరగడం వంటి పనులు చేయకూడదని బోర్డు ఆదేశించింది. ఇప్పటికే లీగ్‌లో 14 మ్యాచ్‌లు పూర్తి కాగా, నేడు జరగబోయే 15వ మ్యాచ్ నుంచి ఈ నిబంధనలు మరింత కీలకం కానున్నాయి. క్రమశిక్షణను పెంచడంలో భాగంగానే ఐపీఎల్ నిబంధనలైన క్లాజ్ 11.5.2, 24.1.4 లను బోర్డు మరింత పక్కాగా అమలు చేస్తోంది. ఈ కొత్త మార్పులు మ్యాచ్ నిర్వహణను మరింత ప్రొఫెషనల్‌గా మారుస్తాయని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>