కలం, మహబూబ్నగర్ బ్యూరో : విద్యను వ్యాపార కేంద్రాలుగా మార్చుతున్న ప్రైవేట్ పాఠశాలలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ జాగృతి సేన (BC Jagruti Sena) రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ (Burugupalli Krishna Yadav) డిమాండ్ చేశారు. శనివారం మహబూబ్నగర్లోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నాయని, ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని విమర్శించారు. విద్యను వ్యాపారంగా మార్చి స్కూల్ డ్రెస్సులు, పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్ముతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలకు కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు తెరవెనుక సహకారం అందిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై నిర్లక్ష్యం వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా హక్కు చట్టం సమర్థంగా అమలు కాకపోవడం వల్ల ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలు నామమాత్రంగానే అమలవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని విద్యా వ్యవస్థను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ జాగృతి సేన జిల్లా అధ్యక్షులు శేఖర్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్, కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సురభి విజయ్ కుమార్, జిల్లా నాయకులు గొడుగు నర్సిములు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

