కలం, హనుమకొండ: అనారోగ్యంతో బాధ పడుతున్న హనుమకొండకు చెందిన దివ్యాంగ బాలుడు నిరంజన్ (Niranjan)ను ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) నేడు పరామర్శించారు. ఇటీవల జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరంజన్ను పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బండ్ల గణేస్ స్పందిస్తూ ఆ బాలుడి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బాలుడిని కలిసి సదరు నగదుకు సంబంధించిన చెక్ అందజేస్తానని చెప్పారు. శనివారం ఉదయం హనుమకొండలోని నిరంజన్ ఇంటికి చేరుకొని కుటుంబసభ్యులతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని నిరంజన్కు ఆత్మస్థైర్యం నింపారు.
నిరంజన్ను పవన్ కల్యాణ్ కలిశాడన్న విషయం తెలిసిన వెంటనే తన వంతు ఉడతా భక్తిగా బాలుడి కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందిస్తున్నట్లు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి జన్మదినం సందర్భంగా నిరంజన్ కుటుంబానికి ఆర్థిక సాయం చెక్కును అందిస్తున్నట్లు చెప్పారు. ఆ డబ్బుని బాలుడి పేరు మీద డిపాజిట్ చేయాలని బాలుడి తండ్రికి సూచించారు. అయితే నిరంజన్ కారు కొనుక్కుంటామని, తనకు కారులో తిరగాలని ఉందంటూ తన కోరికను తెలిపాడు.

