కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్లో సంచలనాత్మక ట్రేడ్కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రిషభ్ పంత్ (Rishabh Pant) మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి చేరనున్నాడనే వార్త క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఈ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు బీసీసీఐ వద్ద ఉన్నట్లు సమాచారం. ఈ భారీ డీల్లో భాగంగా పంత్ ఢిల్లీకి వెళ్తే, కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో కేఎల్ రాహుల్ భవిష్యత్తుపై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి.
మాజీ భారత క్రికెటర్ దొడ్డ గణేశ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేకెత్తించాయి. పంత్ తిరిగి ఢిల్లీకి వస్తే, కేఎల్ రాహుల్ జట్టును వీడి వేలంలోకి వెళ్లాలని ఆయన అభిప్రాయపడినట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే రాహుల్ గత రెండు సీజన్లలో ఢిల్లీకి ప్రధాన బలంగా నిలిచాడు. ఐపీఎల్ 2025లో 539 పరుగులు చేసిన అతడు, 2026లో మరింత దూకుడుగా ఆడి 593 పరుగులు సాధించాడు. పంజాబ్ కింగ్స్పై అజేయంగా 152 పరుగులు చేసి ప్రత్యేక గుర్తింపు పొందాడు.
మరోవైపు రూ.27 కోట్లకు లక్నోలో చేరిన పంత్కు గత రెండు సీజన్లు నిరాశాజనకంగా మారాయి. ఐపీఎల్ 2026లో 312 పరుగులు మాత్రమే చేసిన అతడి జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పంత్ కెప్టెన్సీకి కూడా వీడ్కోలు చెప్పాడు. ఇప్పుడు పంత్ హోంకమింగ్ నిజమవుతుందా? రాహుల్ నిర్ణయం ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నలు ఐపీఎల్ అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతున్నాయి.

