కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth)కి బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) బహిరంగ లేఖ రాశారు. ధాన్యం కొనుగోలు (Paddy Procurement) చేయకుండా అన్నదాతల ఆశలు సమాధి చేశారని, ఆరుగాలం కష్టాన్ని ఆవిరి చేస్తారా? అని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తాలు, తేమ పేరుతో రైతులను ముంచుతున్నా పట్టించుకోరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలు, తరుగు, తేమ లేకుండా వడ్లు కొంటామనే హామీ సమాధి చేశారా? అంటూ రేవంత్ సర్కార్ ను ప్రశ్నించారు. వడ్లకు బోనస్ ఇస్తానన్న కాంగ్రెస్ హామీ అంతా ఉత్తదేనా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

