కలం, వెబ్ డెస్క్ : హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) 66వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వయస్సు అనేది కేవలం నంబర్ మాత్రమేనన్నారు. ఎవరైనా తనను అంకుల్ లేదా తాతా అంటే వారి పని అంతే అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. పనికి వయసుతో సంబంధం ఉండదని.. ఏది ఏమైనా పనిచేసుకుంటూ వెళ్లడమే తన పని అని చెప్పుకొచ్చారు.
కాగా, ఏటా జరుగుతున్న విధంగానే ఈసారి కూడా హైదరాబాద్లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారులు, ఆసుపత్రి సిబ్బంది సమక్షంలో బాలకృష్ణ కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణ తాజా వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే పేదలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే తన తల్లి ఆశయంతోనే బసవతారకం ఆస్పత్రి నడుస్తోందని చెప్పారు. త్వరలోనే హైదరాబాద్లో ‘నార్త్ బ్లాక్’ విస్తరణ చేపడుతున్నామన్న బాలకృష్ణ.. అమరావతి పరిధిలోని తుళ్లూరులో రూ.650 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కొత్త హాస్పిటల్ మొదటి ఫేజ్ 2028 నాటికి పూర్తవుతుందని వెల్లడించారు.

