కలం, నిర్మల్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ ఆవరణలో సాధువులను అవహేళన చేస్తూ, అయోధ్య రామ మందిరాన్ని అవమానించేలా వ్యవహరించారని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
“కాంగ్రెస్ కో హఠావో.. దేశ్ కో బచావో” అంటూ నినాదాలు చేశారు. దేశంలోని సాధు సంతుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం తగదని నాయకులు పేర్కొన్నారు. అయోధ్య రామ మందిరం, హిందూ సంప్రదాయాల పట్ల అవమానకర వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాహుల్ గాంధీ హిందువులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్, వీహెచ్పీ నాయకులు పాల్గొన్నారు.

