కలం, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా జోగిపేటలో (Jogipet Fire) శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని స్థానిక కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న రెండు ఏటీఎం సెంటర్లలో ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు రెండు ఏటీఎం కేంద్రాల్లోని మెషిన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మార్కెట్ ప్రాంగణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు, తోపుడు బండ్ల వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.
వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించకుండా పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఏటీఎం యంత్రాల్లో ఉన్న నగదు ఎంతవరకు కాలిందా? సురక్షితంగా ఉందా? అనే వివరాలు బ్యాంక్ అధికారుల పరిశీలన తర్వాత తెలియాల్సి ఉంది.

