కలం, కరీంనగర్ బ్యూరో : ఏప్రిల్ 5న జరుగనున్న భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ (Babu Jagjivan Ram) 119వ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ (Karimnagar) లో నిర్వహించనున్న ఉత్సవాల పోస్టర్ను శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. నగరంలోని ఆర్&బి అతిథి గృహం (R and B Guest House) లో జరిగిన ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు, జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం అడిషనల్ కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఆర్డీవోతో పాటు పలువురు దళిత నాయకులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, ఏప్రిల్ 5న కరీంనగర్ సివిల్ ఆసుపత్రి సమీపంలోని జగ్జీవన్ రామ్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించనున్న జయంతి వేడుకలకు జిల్లాలోని దళిత సంఘాల నాయకులు, సభ్యులు, ప్రతి దళిత బిడ్డ పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కాదాసు ప్రభాకర్, సుద్దాల లక్ష్మణ్, గజ్జెల ఆనందరావు, గడ్డం నాగరాజు, కొండ స్వరూప, సతీష్ కుమార్, చిలుమల నవీన్ కుమార్, ఎర్రోళ్ల ప్రశాంత్, చామపెళ్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

