కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కీలక మార్పులు చేటు చేసుకోనున్నాయి. పాకిస్థాన్ టెస్ట్ జట్టు కెప్టెన్ పగ్గాలు మళ్ళీ బాబర్ (Babar Azam) చేతికే చేరనున్నాయి. షాన్ మసూద్ కెప్టెన్సీలో పాకిస్థాన్ వరుస ఓటములను చవిచూడటమే ఇందుకు ప్రధాన కారణం. తాజాగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ 104 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ పరాజయం తర్వాత ప్రస్తుత కెప్టెన్ షాన్ మసూద్ను తప్పించి తిరిగి బాబర్ ఆజంకు పగ్గాలు అప్పగించాలని పీసీబీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్ నుండి షాన్ మసూద్ సారథ్యంలో పాకిస్థాన్ ఆడిన 15 మ్యాచ్ల్లో 11 ఓడిపోయింది. తాజా టెస్టులోనూ అటు బ్యాటింగ్లో, ఇటు కెప్టెన్సీలో మసూద్ విఫలం కావడంతో బోర్డు అతనిపై అసహనంతో ఉంది.
ఈ క్రమంలోనే మిగిలిన ఏడు టెస్టుల కోసం బాబర్ను మళ్ళీ బాధ్యతల్లోకి తీసుకురావాలని బోర్డులోని కీలక సభ్యులు భావిస్తున్నారు. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన బాబర్ ఆజం, మే 18న జరిగే రెండో టెస్టులో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో అతను ఫామ్ నిరూపించుకుంటే కెప్టెన్సీ మార్పు ఖాయమని సమాచారం. బాబర్ కూడా తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకుని, అతన్ని అన్ని ఫార్మాట్లకు సిద్ధం చేయాలన్నది బోర్డు వ్యూహం.
మరోవైపు, కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక షాన్ మసూద్ బోర్డులోనే పర్మనెంట్ రోల్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు. గతంలో పీసీబీ చైర్మన్ ఆఫర్ చేసిన ‘డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్’ పదవిని చేపట్టేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

