కలం, వెబ్ డెస్క్: ‘డబుల్ ఇంజిన్’ అంటే పేపర్ల లీకేజీయేనా? అని బీజేపీ (BJP)పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) తీవ్ర విమర్శలు చేశారు. అసమర్థతతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కేంద్ర బీజేపీ సర్కార్ అంధకారంలోకి నెట్టిందని దుయ్యబట్టారు. నీట్ పరీక్షా పత్రాల లీకేజీ (NEET Paper Leak)పై మంత్రి ఫైర్ అయ్యారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అభివృద్ధి చేయడం కాదని.. పేపర్లు లీక్ చేసి నిరుద్యోగుల గొంతు కోయడమేనా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరీక్షకు 42 గంటల ముందే పేపర్లు బయటకు రావడం దారుణమన్నారు. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది.. మన రాష్ట్రంలో 70 వేల మంది విద్యార్థులు ఈస్కాం వల్ల రోడ్డున పడ్డారని అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువులో బుధవారం నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.
జీళ్ళచెరువు క్లస్టర్ పరిధిలోని 13 గ్రామ పంచాయతీల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, భూ సమస్యలపై వచ్చిన వినతులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. న్యాయమైన ప్రతి సమస్యను 100 శాతం పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు అన్ని పేపర్లూ లీక్ అయ్యాయని మండిపడ్డారు. ఆనాటి ప్రభుత్వ మంత్రుల పీఏలే జిరాక్స్ సెంటర్లలో పేపర్లు అమ్మారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆనాడు ఇంటర్ ఫలితాల తారుమారు వల్ల 28 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కేంద్రం సైతం అదే బాటలో పయనిస్తోందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే నియామక సంస్థలను ప్రక్షాళన చేసి, పారదర్శకంగా 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు.

