కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) మార్కెట్ యార్డులో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య (Akula Narasaiah) అధికారులను ఆదేశించారు. బుధవారం మార్కెట్ యార్డులో కొనసాగుతున్న కొనుగోలు ప్రక్రియను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోళ్లలో ఎలాంటి కోతలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. తాలు పేరిట రైతులకు అన్యాయం చేయవద్దని స్పష్టం చేశారు.
రైతుల ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగకుండా చూడాలని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతోనే ధాన్యం కొనుగోలు చేయాలని నర్సయ్య పేర్కొన్నారు. మార్కెట్ యార్డుల్లో రైతులకు తాగునీరు, నీడ, కూర్చునే సదుపాయాలు వంటి సకల వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. కరీంనగర్ మార్కెట్ యార్డును ఆదర్శవంతమైన మార్కెట్గా తీర్చిదిద్దేందుకు అందరం కలిసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు వేల్పుల వెంకటేష్, 11వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్, పలువురు నాయకులు పాల్గొన్నారు.

