కలం, వెబ్ డెస్క్ : పంజాబ్ రాజకీయాల్లో తాజా ఈడీ సోదాలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. రూ.100 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరాను అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) కేంద్ర ప్రభుత్వంపై మునుపెన్నడూ లేని రీతిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం దేశంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలన కొనసాగుతుందని ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు.
ఈడీ, సీబీఐలు అవినీతిని వెలికితీయడానికి కాకుండా, ప్రతిపక్ష నాయకులను భయపెట్టి బీజేపీలో చేర్చుకోవడానికి ‘వాషింగ్ మెషీన్’లా వాడుకుంటున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారంపై కేజ్రీవాల్ స్పందించారు. గతంలో ప్రధాని మోదీ ఎవరిపైతే అవినీతి ఆరోపణలు చేశారో, నేడు వారికే అత్యున్నత పదవిని అప్పగించడం ద్వంద్వ నీతికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. బీజేపీలోకి వెళ్లిన వారికి ఈడీ భయం ఉండదని, కేవలం విపక్ష నేతలే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. అయితే అణచివేత ధోరణి పంజాబ్ గడ్డపై సాగదని హెచ్చరించారు. గురువుల త్యాగాల స్ఫూర్తితో పంజాబీలు ఈ ‘రాజకీయ అఘాయిత్యాలను’ ఎదుర్కొంటారని వెల్లడించారు.

