కలం, వెబ్డెస్క్: దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఓ కేసులో వాదనలు పూర్తయ్యాయి.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సీట్లోంచి లేచేందుకు సిద్ధమవుతున్నారు.. ఇంతలో ‘టెన్ మినిట్స్ సర్’ అంటూ ఓ గొంతు వినిపించింది.. ఆ గొంతు సీనియర్ లాయర్లది కాదు, న్యాయకోవిదులది కాదు.. ఓ 19 ఏళ్ల యువకుడిది. అతని పేరు అథర్వ చతుర్వేది (Atharva Chaturvedi). అది అతనికి సంబంధించిన కేసే. అందుకే తానే స్వయంగా వాదనలు వినిపిస్తానని చీఫ్ జస్టిస్కు విజ్ఞప్తి చేశారు. ఆయన అంగీకరించారు. అంతే, ఆ పది నిమిషాలు ఆ యువకుడి రాతను మార్చాయి. అతని లక్ష్యానికి దారి చూపాయి. ఇంతకీ ఏమా టెన్ మినిట్స్ కథంటే..
అథర్వది మధ్యప్రదేశ్లోని జబల్పూర్. డాక్టర్ కోర్స్ చదవడానికి రెండు సార్లు నీట్ పరీక్ష రాసి, పాసయ్యాడు. 530 మార్కులు వచ్చాయి. అయినా, అతనికి సీట్ ఇవ్వడానికి ప్రైవేటు కాలేజీలు అంగీకరించలేదు. కారణం.. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయడం లేదు. దీంతో సీట్ దక్కలేదు.
దీనిపై మొదట ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు అథర్వ. అక్కడ తన కేసును తానే వాదించాడు. అయితే, అతనికి నిరాశే ఎదురైంది. పైగా, ‘ నువ్వు డాక్టర్ కావాలనుకుంటున్నావ్, లాయర్ కాదు’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఎలాగైనా సీట్ సంపాదించాలనే లక్ష్యంతో సుప్రీంకోర్టుకు వెళ్లాడు అథర్వ. అక్కడ లాయర్ను నియమించుకున్నారు. అయితే, ఫలితం అనుకూలంగా వచ్చేలా కనిపించలేదు. ఈ క్రమంలో ప్రధాన న్యాయమూర్తిని పది నిమిషాలు సమయం అడిగి, తన కేసును తానే వాదించుకున్నాడు.
అథర్వ (Atharva Chaturvedi) వాదనలు విన్న సీజేఐ సూర్యకాంత్ (CJI Surya Kant).. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకున్న ప్రత్యేక అధికారాలను వినియోగిస్తూ, అథర్వకు సీట్ ఇవ్వాలని ఆదేశించారు. ఆర్థికంగా బలహీన వర్గానికి(ఈడబ్ల్యూఎస్)కు చెందిన నీట్ అభ్యర్థులకు తాత్కాలికంగా ఎంబీబీఎస్ ప్రవేశాలు కల్పించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని, నేషనల్ మెడికల్ కౌన్సిల్ను ఆదేశించారు. దీంతో అథర్వకు ఎంబీబీఎస్ సీట్ వచ్చేందుకు రూట్ క్లియరైంది.
కాగా, అథర్వ తండ్రి మనోజ్ చతుర్వేది న్యాయవాది. అయితే, ఆయనెప్పుడూ హైకోర్టులో, సుప్రీంకోర్టులో వాదించలేదు. ఈ కేసులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం మొదలుకొని, అన్నీ ఆన్లైన్లోనే పూర్తి చేసిన అథర్వ, చివరికి తన కేసును తానే వాదించుకొని, పది నిమిషాల్లో సుప్రీంను మెప్పించి సీట్ పట్టేశాడు.
Read Also: మున్సిపల్ ఫలితాలపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp


