కలం, వెబ్ డెస్క్: ఈశాన్య భారత ప్రాంత ప్రజలపై తరచూ జరిగే జాతి వివక్ష, కామెంట్స్ పై ఒక చిన్నారి స్పందించిన తీరు నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్కు చెందిన ఒక చిన్నారి (Arunachal Pradesh Girl).. “మమ్మల్ని చైనీస్ అని పిలవకండి, మేము గర్వించదగ్గ భారతీయులం” అంటూ తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘మీరు చైనీయులా?’ అని ఒక వ్యక్తి ప్రశ్నించిన సందర్భంలో ఆ పాప సమాధానమిస్తూ.. తమను చైనీస్ అని పిలిస్తే కోపం, బాధ కలుగుతాయని, మాతో చైనీస్లో మాట్లాడ వద్దని కోరింది. తాము భారతీయులమని, ఇటానగర్లో నివసిస్తున్నామని చెబుతూ.. తమను ‘ఇండియన్స్’ అని మాత్రమే పిలవాలని విజ్ఞప్తి చేసింది.
అరుణాచల్ ప్రదేశ్ను తమ భూభాగంగా క్లెయిమ్ చేసుకోవడానికి చైనా కుయుక్తులు పన్నుతున్న వేళ, సరిహద్దు ప్రాంతానికి చెందిన ఒక చిన్నారి నోటి వెంట వచ్చిన ఈ దేశభక్తి పూరిత మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పాప చెప్పిన ముద్దుముద్దు మాటలలోని ఆవేదన, దేశభక్తిని మెచ్చుకుంటూ వేలాది మంది నెటిజన్లు “చిట్టితల్లి.. నీ దేశభక్తి సూపర్” అని కామెంట్లు పెడుతూ వీడియోను షేర్ చేస్తున్నారు.

