కలం, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు పిలుపు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర పెట్రోలియం ఫెడరేషన్ కీలక విజ్ఞప్తి చేసింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే పెట్రోల్ బంకులు (Petrol Bunks) తెరిచి ఉంచేలా అనుమతి ఇవ్వాలని ప్రతిపాదన చేసింది. వర్క్ ఫ్రం హోం, వర్చువల్ మీటింగులు, ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా పెట్రోల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవి గోపాల కృష్ణ ఆధ్వర్యంలో పలువురు సభ్యులు పౌరసరఫరాల కమిషనర్ కన్నబాబును కలిశారు.
ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న పొదుపు చర్యల కారణంగా రాత్రివేళల్లో ఇంధన డిమాండ్ తగ్గుతుంది అని తెలిపారు. రాత్రి 10 గంటల వరకే పెట్రోల్ బంకులు (Petrol Bunks) తెరిచి ఉంచితే అవుట్ లెట్లలో విద్యుత్ ఆదా అవుతుందని వివరించారు. దీని ద్వారా మిగిలిన కరెంట్ ను పరిశ్రమలకు కేటాయించడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. అయితే, అత్యవసర సేవలు, ప్రభుత్వ వాహనాలకు మాత్రం సేవలు కొనసాగిస్తామని సమాఖ్య స్పష్టం చేసింది. కాగా, ప్రతిపాదనపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

