కలం, డెస్క్ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల కల్తీ నెయ్యి కేసుపై (Tirumala Ghee Case) తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ తో ఏకసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ఏకసభ్య విచారణ కమిటీకి అవసరం అయిన సహకారాన్ని టీటీడీ అందించాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఇప్పటి వరకు తిరుమల కల్తీ నెయ్యి కొనుగోలు టెండర్లలో లోటుపాట్లపై దినేష్ కుమార్ విచారణ చేయబోతున్నారని జీవోలో ప్రభుత్వం తెలిపింది. 45 రోజుల్లోగా విచారించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసుపై (Tirumala Ghee Case) ఇప్పటికే సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయినా సరే ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ కమిటీని కక్షపూరితంగానే నియమించారంటూ వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్ ఛార్జ్ షీట్ ను బయట పెట్టాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తోంది.


