కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై (West Bengal SIR) ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి మధ్య నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరు వర్గాలను సమన్వయం చేసుకుంటూ, ‘సర్’ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూసేందుకు న్యాయ బృందాలను పర్యవేక్షకులుగా నియమించాలని బెంగాల్ హైకోర్టును ఆదేశించింది. ప్రస్తుతం పదవిలో ఉన్న లేదా మాజీ జిల్లా న్యాయమూర్తులు/అదనపు న్యాయమూర్తుల హోదాలోని న్యాయాధికారులను ఈ ప్రక్రియకు నియమించాలని చెప్పింది. ఈ బృందాలు ఓటరు జాబితాలోని మార్పులు, చేర్పులపై అభ్యంతరాలను పరిశీలించి, విచారణ జరిపి, పరిష్కరించాలని పేర్కొంది.
ఈ ప్రక్రియను వేగంగా, ఈ నెల 28లోపు పూర్తయ్యేలా చూడాలని సుప్రీం చెప్పింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలవాలని ఆదేశించింది. ఈ సమావేశం అడ్వొకేట్ జనరల్, సొలిసిటర్ జనరల్ సమక్షంలో జరగాలని తెలిపింది. అలాగే, షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21న విడుదలయ్యే డ్రాఫ్ట్ లేదా తుది ఓటరు జాబితాను ఫైనల్గా పరిగణించవద్దని సూచించింది. అవసరమైతే, న్యాయ బృందాల విచారణ తర్వాత ఎన్నికల కమిషన్ అదనపు జాబితాను విడుదల చేయవచ్చని పేర్కొంది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది(West Bengal SIR). ‘ రెండు రాజ్యాంగబద్ధ సంస్థల మధ్య ఓటరు జాబితా విషయమై ఆరోపణలు, నిందలు రావడం దురదృష్టకరం. ఇది రెండిటి మధ్య అపనమ్మకాన్ని సూచిస్తోంది’ అని వ్యాఖ్యానించింది. కాగా, బెంగాల్లో ‘సర్’ వివాదంపై నమోదైన పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం విచారించింది.


