కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి (Amaravati)లో శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణాలపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆ రాష్ట్ర ఫ్యాక్ట్ చెక్ విభాగం కొట్టిపడేసింది. ఐకానిక్ సచివాలయ భవనాల వైశాల్యాన్ని విమర్శకులు కేవలం 52.20 లక్షల చదరపు అడుగులుగా తక్కువ చేసి చూపిస్తున్నారని.. నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచి చెబుతున్నారని పేర్కొంది. దీనిని నమ్మవద్దని స్పష్టం చేసింది.
అమరావతిలో పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మిస్తున్న 5 ఐకానిక్ ప్రభుత్వ టవర్ల వివరాలకు అయ్యే ఖర్చును వివరించింది. 5 టవర్లలో జీఏడీ టవర్ (GAD Tower) అత్యంత ఎత్తయిన టవర్. ఇది బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 47 అంతస్తులతో నిర్మాణం అవుతోంది. ఇక మిగిలిన 4 హెచ్వోడీ టవర్లు ఒక్కొక్కటి 39 అంతస్తుల చొప్పున నిర్మితమవుతున్నాయి. వీటితో పాటు వాటి ముందు నిర్మించే విశాలమైన ఆర్కిటెక్చరల్ పోడియంలను కలిపితే మొత్తం నిర్మాణ వైశాల్యం 71.43 లక్షల చదరపు అడుగులు (SFT) అవుతుంది. ఈ మొత్తం విస్తీర్ణానికి బడ్జెట్ను లెక్కగడితే చదరపు అడుగుకు అయ్యే అసలు ఖర్చు కేవలం రూ.17,339 మాత్రమేనని ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ స్థాయి ప్రీమియం నిలువు నిర్మాణాలకు (Vertical Structures) ఈ రేటు పూర్తిగా ప్రామాణికమైనదని పేర్కొంది.
జాతీయ, ప్రాంతీయ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పోల్చి చూసినా అమరావతి కార్యాలయాల రేట్లు అత్యంత హేతుబద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఢిల్లీలోని కేంద్ర పార్లమెంట్ను 4 అంతస్తులతో నిర్మించారని పేర్కొంది. చదరపు అడుగుకు రూ.16,916 ఖర్చయిన కేంద్ర పార్లమెంట్ భవనంతో పోలిస్తే, అమరావతి భవనాలు విపరీతమైన గాలి ఒత్తిడిని, ప్రకృతి విపత్తులను తట్టుకోవాల్సిన అవసరం ఉన్న 250 మీటర్ల ఎత్తైన (47 అంతస్తులు, 39 అంతస్తుల భవనాలు) ఐకానిక్ టవర్లుగా నిర్మితమవుతున్నాయని తెలిపింది. సివిల్ ఇంజనీరింగ్ సంక్లిష్టతను బట్టి చూస్తే చదరపు అడుగుకు రూ.17,339 కావడం మార్కెట్ రేట్లకు అనుగుణంగానే ఉందని వివరించింది. అమరావతి ప్రతిష్టను దెబ్బతీయాలని పనిగట్టుకొని కొందరు చేస్తున్న విమర్శలను నమ్మవద్దని స్పష్టం చేసింది.

