కలం, వెబ్ డెస్క్ : ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2025కు అనుగుణంగా ఉద్యోగులు, టీచర్ల సర్దుబాటుకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh) ఇటీవల గెజిట్లో నోటిఫై చేయగా.. తాజాగా ఇప్పటి వరకు ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు, ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్ల ప్రాతిపదికన ఉద్యోగుల సర్దుబాటుకు మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం అన్ని శాఖల్లో నోడల్ అధికారుల నియామకానికి జీఏడీ ఆదేశాలు జారీ చేసింది.
టీచర్లకు సాధారణ బదిలీలు ఉండవు
ఇప్పటి వరకు ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికన టీచర్ల నియామకాలు జరిగాయి. ఇప్పుడు 26 జిల్లాల ప్రకారం పోస్టులను సర్దుబాటు చేస్తారు. అయితే ఈ ఏడాది టీచర్లకు సాధారణ బదిలీలు ఉండవు, సర్దుబాటు మాత్రమే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా, జోన్ ప్రకారం సొంత జోన్, జిల్లాకు అవకాశాలు కల్పిస్తారు. ఈ సర్దుబాటు పూర్తయిన తర్వాత ఎక్కడి వారు అక్కడ ఆయా జోన్, జిల్లా లోకల్గా మారిపోతారు. సర్దుబాటు సమయంలో ఆయా జిల్లాలో పోస్టుల అవసరాన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. కొన్నిసార్లు బాగా జూనియర్కు సొంత జోన్, జిల్లాకు మారే అవకాశం రాకపోవచ్చని అధికారులు అంటున్నారు. జనగణన కొనసాగనున్న క్రమంలో టీచర్లకు సాధారణ బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

