కలం, వెబ్ డెస్క్ : మన దాహం తీర్చి, జీవితాన్నిచ్చే పవిత్ర జీవ నదులను మనమే చేతులారా చంపేసుకుంటున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి రాజమండ్రిలో ఘాట్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతర అధికారులతో పవన్ సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. నదుల పట్ల నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలకు తాగునీరు దొరకడం కష్టమవుతుందన్నారు. నీటిని ఇష్టారాజ్యంగా కలుషితం చేస్తూ.. మళ్లీ అదే తాగునీటి కోసం జలజీవన్ మిషన్ అంటూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి స్వస్తి పలకాలను పవన్ సూచించారు.
గోదావరి పరివాహక ప్రాంతాల్లో కాలుష్యాన్ని నివారించడానికి ప్రత్యేకంగా అంతర్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. నదుల రక్షణకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని.. ఆరు నెలల్లో నదుల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని పవన్ అధికారులను ఆదేశించారు. నదులు తీవ్రంగా కలుషితమవుతున్న ప్రధాన కేంద్రాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో సోషల్ ఆడిట్ నిర్వహించాలన్నారు. పుష్కరాలకు సంబంధించి ఇప్పటి నుంచే పనులు చేపట్టాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. నదుల్లోకి మురుగు నీరు, కలుషితం కాకుండా దీర్ఘకాలిక ప్రణాళిక అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

