కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ (AP Cabinet) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతులు, పట్టణాభివృద్ధి, భద్రతా వ్యవస్థల బలోపేతం వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం అమరావతి (Amaravati) లో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు మొత్తం రూ.2,540 కోట్ల నిధులకు ఆమోదం తెలిపింది. కృష్ణా నది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులు, సచివాలయం గ్లాస్ క్లాడింగ్ పనులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనలలో మార్పులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
పోలవరం ప్రాజెక్ట్ బాధితులకు గృహ యూనిట్ ఖర్చు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ పరిసరాలలో సివిల్ వర్క్స్ కోసం రూ.798 కోట్లు, ఉండవల్లి జోన్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.580 కోట్ల ప్రణాళికలకు కేబినెట్ (AP Cabinet) ఆమోదముద్ర వేసింది. అలాగే 220 కేవీ కేబుల్స్ రీరూటింగ్ పనులకు రూ.1,180 కోట్లను కేటాయించింది. ప్రకాశం జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు కోసం భూమి కేటాయింపుకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124.5 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2000 బ్యాచ్కు చెందిన 385 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది.

