కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఉపాధ్యాయ బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫిన్లాండ్, జర్మనీ వంటి విదేశాల్లో పర్యటించి, అక్కడి విద్యా విధానాలను పరిశీలించి వచ్చిన ఉపాధ్యాయులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సమాజంలో వెనకబాటుతనానికి ప్రధాన కారణం విద్య లేకపోవడమేనని స్పష్టం చేశారు.
ఒకప్పుడు దేశంలో మనిషి సగటు జీవితకాలం కేవలం 32 ఏళ్లు మాత్రమే ఉండేదని, అయితే జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు వంటి నాయకులు వేసిన బలమైన పునాదుల వల్లే ప్రస్తుతం మనిషి జీవితకాలం 72 ఏళ్లకు పెరిగిందని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా పీవీ నరసింహారావు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు.
రాష్ట్రంలో విద్యా ప్రమాణాల నాణ్యతను మరింత పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. విద్యలో నాణ్యతతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం చాలా ముఖ్యమని చెప్పారు. ఈ విషయంలో తగిన సూచనలు, సలహాల కోసం కె. కేశవరావును కోరానని, ఆయన సలహాదారుగా అనేక విలువైన సూచనలు అందిస్తారని వెల్లడించారు.
సమాజంలో ఎంత ఆస్తి ఉన్నప్పటికీ, చదువు లేకపోవడం వల్లే చాలా మంది వెనకబడిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో, బాగా చదువుకున్న దళితులు నేడు సమాజంలో ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని ఉదాహరించారు. తెలంగాణలో తనకు తెలిసిన గొప్ప మేధావులు ఇద్దరేనని, వారు కేకే, జైపాల్ రెడ్డి అని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు.

