కలం, వెబ్ డెస్క్: నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(NHRC) శుక్రవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కొన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. పిల్లల ప్రైవసీ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, వారి డేటా భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో సంచలనం సృష్టిస్తున్న ఆంథ్రోపిక్ సంస్థతో చిన్నారుల సంక్షేమం కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో) ‘ప్రథమ్’ ఇటీవల టైఅప్ అయిన సంగతి తెలిసిందే. చిన్నపిల్లల చేతిరాతను వీళ్లు ఎనీటైమ్ టెస్టింగ్ మెషిన్ (Anytime Testing Machine – ATM) అనే ఏఐ వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తూ, వాళ్ల అకడమిక్ డేటాను ప్రాసెస్ చేస్తున్నారు. దీనిపై అభ్యంతరం, ఆందోళన వ్యక్తం చేస్తూ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు అందింది.
ఇలా సేకరించిన చిన్నారుల వ్యక్తిగత డేటా, ప్రాసెసింగ్, స్టోరేజ్ సరిహద్దులు దాటితే అది పిల్లల గోప్యతకు ప్రమాదంగా మారొచ్చని పిటిషన్దారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని శత్రువులు, సైబర్ నేరగాళ్లు వాడుకునే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తగినంత రక్షణ చర్యలు లేనందున భద్రత సమస్యలు ఎదురుకావొచ్చని పేర్కొన్నారు. ఎన్హెచ్ఆర్సీ దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ ఫిర్యాదును, అందులో ప్రస్తావించిన అంశాలను ఎన్హెచ్ఆర్సీ (NHRC) పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు, యూనియన్ టెరిటరీస్కు, సెంట్రల్ డిపార్ట్మెంట్స్కు, మినిస్ట్రీస్కు లేఖ రాసింది. పిల్లల డేటా భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

