కలం, వెబ్ డెస్క్: ఎబోలా వైరస్ (Ebola Virus) వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ వంటి ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని స్థాయిల్లో ముందస్తు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఆ నగరాల్లో పరీక్షలు
విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల ట్రావెల్ హిస్టరీ ఆధారంగా స్క్రీనింగ్ చేసి, అనుమానాస్పద లక్షణాలు ఉన్నవారిని వెంటనే క్వారంటైన్కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. విశాఖ పోర్టులో కూడా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది. రోడ్డు మార్గాల ద్వారా రాష్ట్రంలోకి వచ్చే ప్రయాణికులపైనా నిఘా పెంచినట్లు సమాచారం.
ఎబోలా నియంత్రణకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్
ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ (Minister Satyakumar) మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో పొందిన అనుభవాలతో ఎబోలా (Ebola Virus) నియంత్రణకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎయిర్పోర్ట్ అథారిటీ, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న నగరాల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయగా, టీచింగ్ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా 15 పడకల వార్డులు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అవసరమైన పీపీఐ కిట్లు, వైరస్ నిర్ధారణ పరీక్షా కిట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు వర్చువల్ సమావేశాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఎబోలా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు విస్తృతంగా సమాచారం అందిస్తున్నట్లు చెప్పారు.
ఆఫ్రికా దేశాలకు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఆఫ్రికా నుంచి వచ్చిన వారు ఆరోగ్య పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన కోరారు.
Read Also: తెలంగాణకు పద్మ అవార్డులు.. ఎనిమిది మంది ఎంపిక
Reda Also: గుర్తింపు దక్కని అమరులెందరో..!

