కలం, వెబ్ డెస్క్ : ఏపీ తూర్పుగోదావరి జిల్లా కడియంలోని ఆంధ్ర పేపర్ మిల్లు (Kadiyam Paper Mill) లాకౌట్ ప్రకటించింది. శుక్రవారం అర్ధరాత్రి కార్యాలయం గేటుకు లాకౌట్ నోటీసులు అంటించింది. కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఐదు రోజులుగా మెరుపు సమ్మె చేపట్టారు. అయితే, వీరి సమ్మెను బూచిగా చూపి శుక్రవారం రాత్రి ఉద్యోగులను విధులకు హాజరు కాకుండా అడ్డుకుని.. ఆఫీసు గేటు మూసేసి లాకౌట్ నోటీసు అంటించింది. అంతకుముందు యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తామని కడియం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి హామీ ఇచ్చారు.
అయితే, చర్చల కోసం ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో కంపెనీ లాకౌట్ ప్రకటించడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క కార్మికులు ఆకలి పోరాటం చేస్తుండగా మిల్లు యాజమాన్యం లాకౌట్ చేయడంపై దుర్మార్గమైన చర్యగా కార్మికులు తప్పు పడుతున్నారు. మే డే రోజునే కార్మిక వర్గాన్ని అణచివేసేందుకు అక్రమంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

