కలం, కరీంనగర్ బ్యూరో: బీజేపీపై కుట్రలు చేయాలని చేస్తే ఊరుకోబోమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) హెచ్చరించారు. గత పదేళ్లలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను భ్రష్టు పట్టించిన నాయకులు.. ఇప్పుడు తమకు అవినీతి మరకలు అంటించాలని చూస్తున్నారని మండిపడ్డారు. సంబంధం లేని విషయంలో బట్ట కాల్చి మీదేస్తున్నారని.. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని లేదన్నారు. అలాంటి వారికి వెంటనే లీగల్ నోటీసులు పంపిస్తామని, క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పర్యటించిన కేంద్ర మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
టెండర్లతో మాకు సంబంధం లేదు..
యూఐడీఎఫ్ టెండర్ల విషయంలో బీఆర్ఎస్ ఆరోపణలను మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు కేంద్ర మంత్రి బండి సంజయ్కు వివరించగా.. ఘాటుగా స్పందించారు. టెండర్ల వ్యవహారంలో తమకు సంబంధం లేదని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెప్పారు. అయినా బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తూ.. బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో మున్సిపల్ కార్పొరేషన్ను పాలించినవారు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి, ప్రతి పనికి లంచాలు వసూలు చేశారని బండి సంజయ్ ఆరోపించారు. అలాంటి వారు తమ మీద బురద చల్లాలనుకుంటున్నారని చెప్పారు. వాళ్లను ఉపేక్షించమని.. న్యాయపరమైన చర్యలకు సిద్ధం కావాలని హెచ్చరించారు. అవినీతికి తావు లేని విధంగా నగర ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలనే లక్ష్యంతో తాము పనిచేస్తుంటే, చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.

