కలం, వెబ్ డెస్క్ : తిరుమల (Tirumala) నెయ్యి సరఫరా టెండర్లలో భారీ అవినీతి జరిగిందని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు. నెయ్యి టెండర్లలో ఇప్పటి వరకు సుమారు రూ.200 కోట్ల కుంభకోణం బయటపడిందని ఆయన పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఏడాది కాలంలో కేజీ నెయ్యి ధరను రూ.351 నుంచి రూ.716 వరకు పెంచారని జగన్ ఆరోపించారు. దీనివల్ల తిరుమలకు సరఫరా అయ్యే నెయ్యి టెండర్లలో భారీగా అవకతవకలు జరిగాయని అన్నారు.
తిరుమలకు సరఫరా అవుతున్న నెయ్యి వ్యవహారంపై తమ పార్టీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ఆయన విమర్శించారు. అదేవిధంగా ఇందాపూర్ డెయిరీ (Indapur Dairy), హెరిటేజ్(Heritage) సంస్థల మధ్య ఉన్న సంబంధాలపై ప్రశ్నించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని జగన్ తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, నెయ్యి టెండర్లలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

