కలం, వెబ్ డెస్క్ : అనంతపురం (Anantapur) జిల్లా గుత్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన బావాబామ్మర్దులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇసురాళ్లపల్లి గ్రామానికి చెందిన రంగస్వామి, పవన్ అనే ఇద్దరు యువకులు గుత్తిలో జరిగిన తమ స్నేహితుడి వివాహ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి ముగించుకుని తిరిగి తమ స్వగ్రామానికి బైక్పై వస్తుండగా, ఎంగిలిబండ సమీపంలో ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం వీరి బైక్ను బలంగా ఢీకొట్టింది.
దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శుభకార్యానికి వెళ్లి సంతోషంగా తిరిగి వస్తారనుకున్న యువకులు విగతజీవులుగా మారడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: టార్గెట్ హరీశ్ రావు.. సిద్దిపేటలో కవిత మరో కీలక అడుగు
Follow Us On: Instagram

