కలం, వెబ్ డెస్క్ : రాజధాని అమరావతిపై వైఎస్సార్సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి (Amaravati) చట్టబద్ధత అని చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు భ్రమ కల్పిస్తుందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు చెప్తున్న ప్రాంతంలో రాజధాని అనేది 40 ఏళ్లు అయినా పూర్తి కాదని వ్యాఖ్యానించారు. రాని క్యాపిటల్ గురించి చంద్రబాబు భ్రమలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు లెక్కల ప్రకారమే అమరావతికి రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడి కావాలని.. ఇప్పుడు అక్కడ పనిచేసే ఉద్యోగులు ఉండడానికి మాత్రమే నిర్మాణాలు కడుతున్నారని చెప్పారు. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల డెవలప్ ఎప్పటికీ అవుతుందో ఎవ్వరికీ తెలియదని ఎద్దేవా చేశారు.
‘మావిగన్’ కు ప్రజల మద్దతు
తమ అధ్యక్షుడు జగన్ చెప్పిన మావిగన్ (MAVIGUN) కు అమరావతిలో 10 శాతం ఖర్చుతోనే మరుసటి రోజే రాజధాని అవుతుందని సజ్జల తెలిపారు. మావిగన్ ప్రాంతం ఇప్పటికే ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్లతో ప్రపంచంతో అనుసంధానం అయిందని… త్వరలో పోర్టు కూడా వస్తుందని చెప్పారు. అందుకే జగన్ చెప్పిన మావిగన్ ప్రతిపాదనకు ప్రజల నుంచి మద్దతు వస్తుందని పేర్కొన్నారు.
కాంట్రాక్టుల కోసమే చంద్రబాబు ఆరాటం
కేంద్రం దగ్గర చంద్రబాబు (Chandrababu) పలుకుబడి అంతా అమరావతి కోసమే వినియోగిస్తున్నారని సజ్జల (Sajjala) ఆరోపించారు. చంద్రబాబు అవినీతికి తరగని గనిలా అమరావతిని ఎంపిక చేసుకున్నారని ధ్వజమెత్తారు. కేవలం అమరావతిలో కాంట్రాక్టుల కోసమే చంద్రబాబు ఆరాటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే అమరావతిలో పెట్టుబడులు పెట్టడం అంటే.. కృష్ణానదిలో పోసినట్లేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మావిగన్ ను ప్రజలు స్వాగతిస్తున్నారని.. కావాలంటే దానికి బదులుగా ఏ పేరైనా చంద్రబాబు పెట్టుకోవచ్చని అన్నారు. అమరావతిలో ఇప్పడు చేస్తున్న వాటిని అక్కడితో ఆపేస్తే డబ్బు వృథాకాకుండా ఉంటుందని.. ఆ డబ్బును మావిగన్ చోట పెడితే సత్వరమే రాజధాని అందుబాటులోకి వస్తుందని సూచించారు.
Read Also: ఏపీలో గ్యాస్ సరఫరాపై సీఎం కీలక ఆదేశాలు
Follow Us On: Instagram

