కలం, వెబ్ డెస్క్: ఆంధ్రుల కల సాకారం అవుతున్న తరుణంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం సంబరాలకు పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి కి చట్టబద్ధత కల్పించే బిల్లు (Amaravati Bill) ను లోక్ సభ ఆమోదం తెలుపడంతో సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. పుష్కర కాలంగా వేచిచూసిన తమ కల నెరవేరబోతున్న తరుణంలో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం రాజ్య సభలో కూడా లాంఛనంగా చర్చ జరిగి బిల్లు ఆమోదం పొందనుంది. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ పోస్ట్ ఫ్యాక్టో ర్యాటిఫికేషన్ చేసి అనంతరం రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
సీఎం చంద్రబాబు మధ్యాహ్నం రాజధానిలో శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వెళ్లనున్నారు. 2015లో నాడు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతానికి మంత్రులు, కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలతో కలిసి ఆయన వెళ్లనున్నారు. బుధవారం ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణానికి హాజరైన చంద్రబాబు.. అక్కడినుంచిహైదరాబాద్ వెళ్లనున్నారు. అక్కడ ఓ శుభకార్యంలో పాల్గొని అనంతరం అమరావతి రానున్నారు. అయితే రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఉద్దండరాయునిపాలెంలో రైతులు, ప్రజలతో కలిసి సంబరాల్లో సీఎం పాల్గొననున్నారు.
2024 జూన్ 2 నుంచి ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం- 2014లోని సెక్షన్ 5(2)కి సవరణ చేస్తూ కేంద్ర హోం శాఖ ఈ బిల్లును రూపొందించింది. బుధవారం ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. సుమారు 2 గంటలపాటు చర్చ తర్వాత అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, సమాజ్వాదీ సహా పలు పార్టీల ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. అనంతరం బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. అయితే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ సభ నుంచి వాకౌట్ అయింది.

