కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో జరుగుతున్న రామాలయ (Akividu Ramalayam) నిర్మాణ పనులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆలయ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను నేడు విచారించిన సుప్రీం కోర్టు.. రామాలయ నిర్మాణంపై స్టేటస్ – కో కొనసాగించాలని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పనులు ముందుకు సాగకూడదని తేల్చింది. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను నాలుగు వారాల కాలానికి వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పిటిషన్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ స్పందించారు. ప్రభుత్వ భూముల్లో మతపరమైన నిర్మాణాలు వద్దని సుప్రీంకోర్టు చెప్పిందని వెల్లడించారు. స్థానికులకు అడగకుండా డిప్యూటీ స్పీకర్ రఘురామ గొంతెనమ్మ ఆలయం కూలగొట్టారని వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాణ పనులను ఆపివేయాలని సుప్రీంకోర్టు తేల్చిందని, నాలుగు వారాల తర్వాత స్పష్టమైన తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

