కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రూ.4.50 కోట్ల నిధుల దుర్వినియోగంపై ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) జిల్లా కమిటీ సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు ఫిర్యాదు చేసింది. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ.. 2021 నుంచి 2024 వరకు జిల్లా ఆసుపత్రిలో అవినీతి, అక్రమాలు జరిగాయని.. 2023లో అప్పటి DMHO డాక్టర్ లలితదేవి ఇచ్చిన రిపోర్టులో అవినీతి స్పష్టంగా నిరూపితమైనా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. ఆసుపత్రిలో హెచ్డీఎస్, కాయకల్ప, టీవీవీపీ, టీఎస్ఎంఎస్ఐడీసీ నిధులతో పాటు వాహనాల డీజిల్, పెట్రోల్ ఖర్చుల పేరిట దాదాపు రూ.4.50 కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు.
అవినీతి అధికారులకు పదోన్నతులా?
ఇంత పెద్ద కుంభకోణం జరిగినా సొమ్మును రికవరీ చేయకుండా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్లను కాపాడుతున్నారని ఏఐఎఫ్బి ధ్వజమెత్తింది. అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణప్రసాద్ను ప్రస్తుతం టీవీవీపీ సూపరింటెండెంట్గా, డాక్టర్ నవీనను ఆర్ఎంవోగా అదే స్థానాల్లో కొనసాగించడమేంటన్నారు. అవినీతికి బాధ్యులైన వైద్యులను తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు. స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. AIFB ప్రతినిధుల ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. వైద్యారోగ్య కమిషనర్కు రాస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

