కలం, నిర్మల్: గిరిజనులతో పాటు ఎస్సీ, దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) అన్నారు. శనివారం ఉట్నూరు పీఎంఆర్సీ కేబీ కాంప్లెక్స్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షేమ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, నిధుల వినియోగంలో జాప్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు.
మౌలిక వసతుల బలోపేతం…
గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించడంతో పాటు రహదారులు, మౌలిక వసతులను బలోపేతం చేస్తామని మంత్రి అడ్లూరి తెలిపారు. సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అంతకుముందు కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రోత్సాహక నగదు చెక్కులను మంత్రి అందజేశారు.
ఈ కార్యక్రమంలో బోథ్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు పటేల్, ఎంపీ గోడెం నగేష్, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సంతోష్, గురుకులాల కార్యదర్శి సీతమహాలక్ష్మి, ఐటీడీఏ, సోషల్ వెల్ఫేర్, ఎస్సీ కార్పొరేషన్, దివ్యాంగుల సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

