కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను (Prajavani Complaints) సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (Additional Collector) భుజంగరావు (Bhujanga Rao) అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 116 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ భుజంగరావుతో పాటు ట్రైనీ కలెక్టర్ సురేష్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, డీపీఓ శ్రీనివాస్రావులకు వివరించి అర్జీలు సమర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భుజంగరావు మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో ప్రజావాణికి వస్తారని తెలిపారు. అందిన అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి, నిబంధనల మేరకు సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

