కలం, వరంగల్ బ్యూరో: కొండా సురేఖను మంత్రి పదవి నుంచి కాంగ్రెస్ అధిష్టానం బర్తరఫ్ చేసిన తర్వాత అధికార వర్గాల్లోనూ (Warangal Officers) గుబులు రేపుతోంది. ముఖ్యంగా కొండా దంపతుల సిఫారసులతో పోస్టింగ్లు పొందినట్లుగా ప్రచారంలో ఉండగా.. ఇందులో పోలీస్, రెవెన్యూ, దేవాదాయ, అటవీ శాఖల అధికారులు తమ భవిష్యత్ పై ఆందోళనలో పడ్డట్టు చర్చ జరుగుతోంది.
“ ఇప్పుడు మా పరిస్థితి ఏంటి?’ అనే చర్చ అధికార వర్గాల్లోనూ జోరుగా నడుస్తోంది. కీలక స్థానాల్లోని కొందరు అధికారులు ఇప్పటికే తమ సన్నిహితులతో రాజకీయ పరిణామాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. తమ పోస్టింగ్లు ఉంటాయా.. ఊడుతాయా..? అనే ఉత్కంఠ వారిలో నెలకొన్నట్లు తెలుస్తోంది.
కొండా కోటరీ ముద్ర.. బదిలీల భయం!
కొండా దంపతులకు సన్నిహితంగా వ్యవహరించినట్లు ముద్రపడిన కొందరు అధికారులు వివిధ సందర్భాల్లో రాజకీయ విమర్శలు, శాఖాపరమైన చర్యలను ఎదుర్కొన్నారనే వాదన ఉంది. కొందరు సస్పెన్షన్కు గురికాగా.. మరికొందరు బదిలీలను ఎదుర్కొన్నట్లు అధికార వర్గాల్లోనూ ప్రచారం జరుగుతోంది.
మారిన పరిణామాల దృష్ట్యా మిగిలిన అధికారుల్లోనూ ఆందోళన నెలకొంది. కొండా సురేఖపై వేటు పడిన నేపథ్యంలో ఆమె సిఫారసులతో పోస్టింగ్లు పొందినట్లు ప్రచారం జరిగే అధికారుల పరిస్థితి ఏమిటనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. రాజకీయ సమీకరణాలు మారితే అధికార యంత్రాంగంలోనూ మార్పులు వస్తాయా? లేక పోస్టింగులు కొనసాగుతాయా? అనేది తేలాల్సి ఉంది.

